Friday, April 19, 2024

త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంపు – కేసీఅర్ కి పువ్వాడ కృతజ్ఞతలు

ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు.’మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయంను స్వాగతిస్తూ కార్మికలోకం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని వారు తెలిపారు.

పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వచ్చేలా ఇప్పటికే ప్రభుత్వంకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఅర్ వారి శ్రమను గుర్తించారని అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

టీఎస్ ఆర్టీసి సంస్థ అభివృద్దే లక్ష్యంగా మరో ముందడుగు వేస్తూ త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం కేసీఅర్ ఆదేశించినట్లు తెలిపారు.తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదన్నారు.

. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని, కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. కార్మికుల కష్టాలు ఎరిగిన మహనీయుడు కేసీఅర్కు రాష్ట్ర కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement