సూర్యాపేట: కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ హయాంలో దళారి వ్యవస్థ లేకుండా ఆన్లైన్ విధానం పెట్టామని తెలిపారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని చెప్పారు. కౌలు రైతులను పాసు పుస్తకం నంబర్లు అడుగుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పథకాలు అడుగుతున్నారని, పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పత్రాల డ్రామాలు ఎక్కువకాలం సాగవన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని, హామీలు అమలు చేయలేకపోతే ప్రజలు వెంటపడి తరుముతారని హెచ్చరించారు.