Tuesday, April 30, 2024

NZB: స్క్రూటినీలో 10మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ..

నిజామాబాద్, ఏప్రిల్ 26 : లోక్ స‌భ‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి దాఖలైన నామినేషన్లను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం స్క్రూటినీ జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ సమక్షంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల ముందర రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా 10మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు.

నిజామాబాద్ లోక్ స‌భ‌ నియోజకవర్గ స్థానానికి 42మంది అభ్యర్థులు 90నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీలో 10మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయన్నారు. అఫిడవిట్ సమర్పించకపోవడం, సక్రమంగా లేకపోవడం, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పొందుపర్చక పోవడం వంటి కారణాల వల్ల పది నామినేషన్లు తిరస్కరించబడ్డాయన్నారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థి వారీగా నామినేషన్ పత్రాలను వారి సమక్షంలోనే పరిశీలిస్తూ, తిరస్కరణకు గురైన నామినేషన్లు ఎందుకు తిరస్కరించబడ్డాయనే వివరాలను స్వయంగా కలెక్టర్ అభ్యర్థులకు వెల్లడించారు.

నామినేషన్లు తిరస్కరణకు గురైన వాటిలో మిర్యాల్ కర్ జయప్రకాశ్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎం.డీ.షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోశం, మీసాల శ్రీనివాస్ రావు, వి.మహాతేజ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement