Friday, May 3, 2024

NZb: మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షనీయం..

నిజామాబాద్, మార్చి 13 (ప్రభ న్యూస్) : మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని నగర మాజీ మేయర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత, రాష్ట్ర కార్యదర్శి లింగం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మాజీ మేయర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత మాట్లాడుతూ.. మున్నూరు కాపుల ఆకాంక్ష అయినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఫైనాన్స్ కార్పొరేషన్ వలన అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం శుభ పరిణామం అన్నారు.

కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధులు ఇవ్వాలని, నిధులు ఉంటేనే మున్నూరు కాపుల అభివృద్ధి మరింత సాధ్యమవుతుంద న్నారు. 60లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపుల కార్పొరేషన్ కోసం రూ.500 కోట్లు ప్రకటించాలని కోరారు. మున్నూరు కాపులు అంటేనే సేవదాతలని, వ్యవసాయాన్ని నమ్ముకుని, దేశ ప్రజల కడుపు నింపేది మా కులస్తులని, కులవృత్తిని నమ్ముకొని దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మున్నూరు కాపుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలన్నారు.

అనంతరం రాష్ట్ర కార్యదర్శి లింగం మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా కార్పొరేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిమిత్తం ప్రకటించడం కాకుండా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న అధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బాజిరెడ్డి జగన్, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలితతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఇవ్వాలని
డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆకుల శ్రీశైలం, ఎండల ప్రసాద్, చింతకాయల రాజు, కిషన్ రెడ్డి, భూపతి, నరేష్, ప్రవీణ్, మహేష్, భోజరాజు, కర్క రమేష్, జెట్టి గోవిందరాజ్, శ్రీకాంత్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement