Monday, April 29, 2024

NZB: ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా… ధ‌న్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 20 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని.. తాను పక్కా లోకల్ అని… ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించండని బీజేపీ అర్బన్ అభ్యర్థి ధ‌న్ పాల్ సూర్య నారాయణ కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్తులు టూరిస్ట్ నాయకులు అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని 38వ డివిజన్ లోని అరుంధతి నగర్ కాలోని దుబ్బ నుంచి బీజేపీ అభ్యర్థి ధ‌న్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ‌న్ పాల్ మాట్లాడుతూ.. నగరంలో BRS, కాంగ్రెస్ అభ్యర్థులు లోకల్ వారు కాదన్నారు. నగరంలో అభివృద్ధి శూన్యమ‌న్నారు. పరాయి వాళ్ళ పెత్తనం మనకెందుకు అని ప్రశ్నించారు. నగరంలో తాను ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో దేవాలయాల అభివృద్ధికి సహకరించానన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అవినీతి తారా స్థాయికి చేరిందన్నారు. కుటుంబ పాలన పోవాలంటే.. బీజేపీకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మీలో ఒకడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాన‌న్నారు. నగరంలో ఏన్నో సమస్యలు పేరుకుపోయాయన్నారు. 2014 లో డబుల్ బెడ్రూమ్ లు అందజేస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. పేదవారి సమస్యలను ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బీజేపీ మేనిఫెస్టో వచ్చాక ఈ సారి బీజేపీ అభ్యర్థులని గెలిపిస్తామనే నమ్మకం ప్రజల్లో కల్గిందన్నారు. 10ఏళ్ల‌ పాలనలో నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జెండా ఎగరేస్తుందన్నారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం రాజు, శ్రీరామ్, కొండా ఆశన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, కరిపే గణేష్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement