Friday, May 3, 2024

NZB: ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు.. నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం..

నిజామాబాద్, మార్చి 16(ప్రభ న్యూస్): అర్ధరాత్రి మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈడికి విడదీయ లేని బంధం ఉంద న్నారు. ఐటి, ఈడి, సిబిఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలను జేబులో పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రంలో మోడీ పర్యటిస్తున్నారంటే ఆయన వచ్చే ముందు ఐటి దాడులు చేసి భయంబ్రాతులకు గురిచేస్తున్నారన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, మహిళా లోకం మండిపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు అరెస్టు చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కుట్ర పూరితమని మండిపడ్డారు. ఏడాది క్రితం కవితకు సాక్షిగా నోటీస్ ఇచ్చి ఇప్పుడు అరెస్టు చేయడం ఏమిటని ప్రజానీకం ప్రశ్నిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా అరెస్టు ఎలా చేస్తారు.. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలి, లేనిపక్షంలో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సిర్ప రాజు, ఉద్యమకారులు సుజాత్ సింగ్ ఠాగూర్, రవి చందర్, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, విక్రమ్ గౌడ్, సాయి వర్ధన్, ప్యాట సంతోష్, విజయలక్ష్మి, ఆకాష్, శ్రీనివాస్ గౌడ్, మధు అపర్ణ, శోభావతి, సాయి వర్ధన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement