Sunday, April 28, 2024

YCP List – ఇది చ‌రిత్రలో గొప్ప ఘ‌ట్టం – సామాజిక న్యాయం పాటించాం – జగన్

(కడప బ్యూరో, ప్రభన్యూస్) వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇంత ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నానని ఆయన అన్నారు.
కాగా, ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేలు , 18 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరిగిందని వివరించారు. దాదాపుగా 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామని, . ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమేనని, ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నా అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

టిక్కెట్లు రానోళ్లందరికీ సముచిత స్థానం

సీట్లు మారిన నాయకులు , టికెట్ రాని నాయకులకు మనస్పూర్తిగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని వాళ్లందరికీ భరోసా ఇస్తున్నా అన్నారు. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ ఐదు సంవత్సరాల పాలన జరిగిందని, రూ.2.70 లక్షలకోట్లు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామని వివరించారు.

లంచాలు.. వివక్ష లేని సంక్షేమం మనది
రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి కాదు.. ఇది సాధ్యమే అని 5 సంవత్సరాల పరిపాలనలో గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు, వివక్షకు చోటు లేని వ్యవస్థలో రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకివెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండిపోతుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

మాటల్లోనే కాదు.. చేతల్లోనూ సామాజిక న్యాయం

- Advertisement -

ఈ ఒక్కటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులుమారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం బాగుపడింది. మహిళాసాధికారిత జరిగింది. సామాజిక న్యాయం మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటన్నిటివల్ల ప్రస్పుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుని పోయే అడుగులు కూడా వేస్తాం అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement