Sunday, April 28, 2024

Union Minister : మోడీ అంటేనే అభివృద్ధికి నాంది.. రూపాలా

గోదావరి ఖని, మే 20 (ప్రభ న్యూస్‌): మోడీ అంటేనే దేశ అభివృద్ధికి నాంది అని, తొమ్మిదేళ్ల ప్రధాని మోడీ పాలన ఆదర్శనీయమని కేంద్ర పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రామగుండం పర్యటనలో భాగంగా శనివారం గోదావరిఖని శారదనగర్‌ లోని రెడ్డి భవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే, టిఎస్‌ ఆర్టిసి మాజీ చైర్మన్‌ సోమవారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి కేంద్ర నాయకులు వివేక్‌ వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పదవులను పంచుకోవడంలోనే కాలం వెళ్లదీస్తోంద‌ని, ముఖ్యమంత్రి పదవి పంచుకునే దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీ చేరుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని భారాస ప్రభుత్వం ప్రజలకు గారడి మాటలు చెబుతూ మాయమాటలతో మోసపూరిత వాగ్దానాలు చేయడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలన అంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ కాదని, కేసీఆర్ది మాత్రమే బంగారు కుటుంబమన్నారు. తెలంగాణలో అభివృద్ధి చేయలేనివాడు దేశంలో అభివృద్ధి చేస్తానని ముందుకు పోవడం దురదృష్టకరమన్నారు.

కేసీఆర్‌ పాలన చేపట్టిన నాటినుండి తెలంగాణ అధ్వాన్న స్థితికి చేరుకుందని, ఉచిత వాగ్దానాలు తప్ప ఆచరణలో శూన్యమన్నారు. కేసీఆర్‌ కుటుంబమే అవినీతి కుటుంబంగా మారిపోయిందని, ప్రాజెక్టుల పేరుతో అనేక అవినీతి పనులు చేస్తూ కమిషన్లు దండుకుంటూ ముందుకు పోతున్నారన్నారు. పెద్దపల్లి జిల్లాలో సైతం భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేయాలని, మూడు నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరవేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. మోడీ అధికారం చేపట్టిన నాటినుండి తెలంగాణలో రోడ్లు, పరిశ్రమలు, రైతుల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. మూసివేతకు గురైన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి ఎరువుల కర్మాగారం ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. భారతదేశ అభివృద్ధి నరేంద్రమోడీ లక్ష్యమని, ప్రపంచంలోనే భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నరేంద్ర మోడీ భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తున్నారని తెలిపారు. దేశంలో ఎన్ని పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక ఎత్తులు వేస్తున్నాయని, ఆ ఎత్తులను చిత్తు చేసి రాబోయే ఎన్నికల్లో సైతం ప్రజల ఆశీర్వాదంతో ఆదర్శవంతమైన పాలనను అందిస్తామన్నారు. మోడీ సారథ్యంను ప్రజలు ఇంకా కోరుకుంటున్నారని, మూడోసారి దేశంలో కాషాయ జెండా ఎగురుతుందన్నారు. దేశంలో అవినీతి ప్రభుత్వాలకు ప్రజలు చరమగీతం పాడనున్నారని, అవినీతి ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా అవినీతికి తావులేని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ పిడుగు కృష్ణ, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement