Tuesday, April 30, 2024

తెలంగాణా పాఠ‌శాల‌ల్లో వంద శాతం న‌ల్లాలు …కేంద్రం ప్ర‌శంస‌లు..

హైదరాబాద్‌, దేశంలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ మరో ఘనతను సొంతం చేసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇప్పటికే దేశంలో 100 శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ప్రకటించిన కేంద్రం తాజాగా.. పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్స్‌ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి రాష్ట్రంగా కేంద్రం ప్రకటించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమాల్లో 100 శాతం నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని… గతేడాది గాంధీ జయంతని పురష్కరించుకొని 100 రోజుల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. నిర్దిష్ట సమయంలో ఈ ప్రణాళికను తెలంగాణ, ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, గోవా, హర్యానా రాష్ట్రాల్లో పూర్తి చేసినట్టు ఆదివారం కేంద్ర జలశక్తి శాఖ వివరాలు వెల్లడించింది. ఈ మిషన్‌ అమలుకు మరింత సమయం కావాలని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోరాయి. రాష్ట్రాల సూచన మేరకు 100 రోజుల ప్రణాళిక ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మొదట్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా చేసిన మంత్రి కేటీఆర్‌లకే ఈ క్రెడిట్‌ దక్కుతుందన్నారు. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకున్న మిషన్‌ భగీరథ పథకం మరో ప్రశంసను పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన ముందుచూపు, చొరవ, తెగువ వల్లే ఇది సాధ్యమైందన్నారు. అవార్డులు, ప్రశంసలతో పాటు కేంద్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి నిధులు కూడా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement