Friday, April 26, 2024

పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

పేద‌ల కోసం ఇండ్లు క‌ట్టించి ఇస్తున్న కార్య‌క్ర‌మం దేశంలో ఎక్క‌డా కూడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో రూ. 9 వేల కోట్లతో ఇండ్లు క‌ట్టించి ఇస్తున్న న‌గ‌రం భార‌త‌దేశంలో హైద‌రాబాద్ ఒక్క‌టేన‌ని తెలిపారు. శనివారం హైదరాబాద్ అంబేడ్క‌ర్ న‌గ‌రంలో నూత‌నంగా నిర్మించిన 330 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేడ్క‌ర్ న‌గ‌ర్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. ఇంత అద్భుత‌మైన ఇళ్లు నిర్మించి ఇస్తార‌ని అనుకోలేద‌ని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. ఇదే స్థ‌లంలో ప్ర‌యివేటు అపార్ట్‌మెంట్‌ క‌ట్టి ఉంటే కోటిన్న‌ర అయి ఉండేద‌ని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇళ్లు నిర్మించి ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇల్లు క‌ట్టాల‌న్న‌, పెళ్లి చేయాల‌న్న క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఇల్లు క‌ట్టించి ఇచ్చి, ఆడ పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు అండ‌గా నిలుస్తున్నారని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో చెట్లు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచే బాధ్య‌త‌ను ఆడ‌బిడ్డ‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హుస్సేన్ సాగ‌ర్ ఒక‌ప్పుడు మురికికూపంగా ఉండేదని, ఇప్పుడిప్పుడే దాన్ని బాగు చేసుకుంటున్నామని తెలిపారు. సాగ‌ర్ ప‌రిస‌రాల్లో చెత్త వేయ‌నీయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement