Tuesday, May 7, 2024

సీఎం కేసీఆర్ ను గద్దె దింపడమే తన కర్తవ్యం: ఈట‌ల రాజేందర్

హుస్నాబాద్, (ప్రభన్యూస్): ధనిక రాష్ట్రం అప్పులఊబిలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యి మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో రైతులకు రూ. 1లక్ష రుణమాఫీ చేస్తానని నేటికీ అమలు చేయని సీఎంగా నిలిచిపోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పార్లమెంట్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది తిరిగి కేసీఆర్ కే వెళ్తుందన్నారు. తెలంగాణ కోసం 14ఏళ్లు పోరాటం చేస్తే, చిల్లర ఆరోపణతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపారని పేర్కొన్నారు. ఆయనను గద్దె దింపడమే నా కర్తవ్యమన్నారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే తనను రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ చేశారని తెలిపారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయని సీఎం కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తే మన బతుకులాగమవుతాయని, రాష్ట్రం బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement