Monday, April 29, 2024

Maharashtra – మ‌రాఠా గ‌డ్డ‌లో కారు స్పీడ్ …అంబేద్క‌ర్ వాదంతో ముందుకు ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :
భారాస జాతీయ పార్టీగా విస్తరించేందుకు పక్కా ప్లాన్‌, ఫర్ఫెక్ట్‌ వ్యూహంతో ముందు కు వెళ్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న చందంగా సొంత రాష్ట్రం తెలంగాణలో మూడో సారి హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారం చెక్కు చెదరకుండా చూసుకుంటూనే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై కన్నే సింది. మరాఠ్వాడలో నెలకొన్న రాజకీయ అనిచ్చితితో అంది వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావి స్తోంది. ప్రజానాడీకి అనుగుణంగా నిర్ణయాలతో ముందు కు వెళ్లే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఇప్పటికే సభ్యత్వ నమోదు, గ్రామ గ్రామాన పార్టీ విస్తరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించి.. ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చిందన్న అభిప్రాయంలో అధిష్టానం ఉంది. అదే ఉత్సాహాన్ని కొనసాగించేలా సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర లో పర్యటనలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనేందుకు అక్కడి నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. నిత్యం పార్టీలో చేరికలు జరిగేలా స్థానిక న్యాయకత్వానికి బాద్యతలను అప్పగించారు. మరాఠ్వాడతో అనుబంధం ఉన్న తెలంగాణ నేతలు వారికి పూర్తి సహాయ సహకారాలు అందేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీబీ ఛైర్మన్‌లు, సర్పంచ్‌ల వరకు కొనసాగిన చేరికల పర్వం త్వరలో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఎన్నికల ముందు నుంచి ప్రజా బలం ఉన్న ఆశావహులు, సిట్టింగ్‌లు చేరే ఛాన్స్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నాటి ఉద్యమ ఫార్మూలే అమలు
తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉన్న ప్రాంతాలు, తెలంగాణ ప్రభావం ఉన్న మహారాష్ట్రలోని నాటి హైదరా బాద్‌ స్టేట్‌ ప్రాంతాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా స్థానిక న్యాయ కత్వాన్ని అధినేత కేసీఆర్‌ రంగంలోకి దించారు. మొదట్లో తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తెలిసేలా ఎలాం టి వ్యూహాలను అమలు చేసి రాష్ట్ర ప్రముఖ్యతను వివరిం చారో.. అలాంటి ఎత్తు గడలనే మహారాష్ట్రలోనూ ప్రయోగి స్తున్నారు. విలువైన వనరులు, నదులు, రాజకీయ చైతన్యం లాంటివి ఉన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో వివరిస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం ఏం చేయగలమో తెలుపు తున్నారు. తెలంగాణ మోడల్‌ను ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాలకోసం ఎదురు చూస్తు న్న స్థానిక నేతలను కారెక్కించి ప్రచారంలో పరుగులు పెట్టిస్తు న్నారు. మరాఠా భాషలోనే జాన పద గేయాలతో ప్రచార రథాలను ఊరూరా తిప్పుతున్నారు. నిత్యం ప్రగతి భవన్‌ నుంచి మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలపై పర్యావేక్షిస్తున్నారు. హైదరాబాద్‌ వస్తున్న నేతలకు ఎప్పటికప్పుడు కార్యాచరణ, ప్రణాళిక లను వివరిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు.

మహా పర్యటనలకు ప్రాధాన్యం
భారాస అధినేత కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటనలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అక్కడి న్యాయకత్వం పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌ సభతో ఆరంగేట్రం షురూ చేశారు. తర్వాత మార్చి 14న కాందార్‌ లోహాలో రెండో బహిరంగ సభతో ఊపును తీసుకువచ్చారు. మే 19న అదే ఉత్సాహంతో మరోసారి నాందేడ్‌లో పర్యటించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక న్యాయకత్వానికి దిశానిర్ధేశం చేశారు. జూన్‌ 26, 27న రెండు రోజుల పర్యటనకు భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. సర్కోలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించి పార్టీ విస్తరణ, మహారాష్ట్రలో చేయబోయే పనులపై శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఆ నాలుగు ప్రాంతాల్లో గెలుపే టార్గెట్‌
మహారాష్ట్ర భౌగోళికంగా పెద్ద రాష్ట్రం. పార్టీ విస్తరించా లంటే చాలా సమయం పడుతుందని భావించిన అధినేత కేసీఆర్‌ సరికొత్త ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు. నాలుగు ప్రాంతాలను టార్గెట్‌గా పెట్టుకొని కార్యక్రమాలను చేపడు తున్నారు. నాందేడ్‌, నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌, పుణ బెల్ట్‌ లల్లో క్షేత్రస్థాయికి చొచ్చుకు వెళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్‌, నాగ్‌పూర్‌లో ఆశించిన దానికన్నా ఎక్కు వగా జనంలోకి పార్టీని తీసుకెళ్లినట్లు అధినేత భావిస్తున్నా రు. అంతే ఉత్సాహంతో పుణ, ఔరంగాబాద్‌లోనూ విస్తరణ కార్యక్రమాలు జరిగేలా నాయకత్వానికి వ్యూహాలను అమలు చేసే బాధ్యతలను అప్పగించారు. ఇప్ప టికే ఆరు డివిజన్ల వారిగీ బాధ్యతలను అప్ప గించారు. స్టీరింగ్‌ కమిటీని ప్రకటించారు. మహారాష్ట్రకు ఇంఛార్జ్‌ను నియమిం చారు. భవిష్యత్‌లోనూ మరిన్ని పద వులు పంపకాలు ఉండనున్నట్లు స్థానిక నేతలతో అధినేత తెలిపినట్లుగా సమా చారం. 288 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌ లు, పార్లమెంట్‌ కన్వీనర్లు, జిల్లా అధ్య క్షులు, ఉపాధ్యక్ష పదవులు పంపకాలు చేయనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

దళితులపై ఫోకస్‌.. సాయంపై వివరణ
భారాస మహారాష్ట్రలో అంబేద్కర్‌ వాదాన్ని ఎత్తుకోబో తుంది. రాజ్యాంగ రచియిత సొంత గడ్డలో స్థానిక ప్రజల వెనకబాటును ప్రశ్నించబోతుంది. పేద వర్గాలు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందకపోవడం వెనుక కారణాలను వివ రించనుంది. ఇప్పటికే భీమ్‌ ఆర్మీ చీఫ్‌ హైదరాబాద్‌ పర్య టనలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. భారాస జాతీయ స్థాయి లో విస్తరించాలని, తాము గులాబీతో కలిసి సాగుతామని చంద్రశేఖర్‌ ఆజాద్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం భీమ్‌ ఆర్మీ చీఫ్‌కు 2 ప్లస్‌ 2 సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. త్వరలో మహారాష్ట్రలో అంబేద్కర్‌ వాదాన్ని, మైనార్టీలకు తాము చేస్తున్న సాయాన్ని వివరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement