Tuesday, May 14, 2024

TS | తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీకి రాజ్యసభ సీటు ప్రపోజల్ పెట్టబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా విముఖత చూపిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు వచ్చే రెండు స్థానాల్లో ఏఐసీసీకి ఒకటి, రాష్ట్ర నేతలకు మరో స్థానం ఇచ్చే అవకాశం ఉంది.

ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. రెండో సీటు కోసం భారీగా ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీ చందర్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది.

ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ దేవతలాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో కచ్చితంగా తెలంగాణ నుంచి సోనియాగాంధీకి ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

అందులో భాగంగానే ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే, ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే కనుక.. కచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరును తెలంగాణ నుంచి ప్రతిపాదించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement