Friday, April 26, 2024

పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి..

పెద్దపల్లి ‌: పట్టణాలకు ధీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లిలో ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ. 29.4లక్షలు, భోజన్నపేటలో రూ. 22.68లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులతో గ్రామాల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. సీసీరోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాస ప్రభుత్వ హయాంలో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, తద్వారా గ్రామాలు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారని కొనియాడారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, సర్పంచ్‌లు మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, మేకల మల్లేశ్‌యాదవ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, ఎంపీటీసీలు తిరుపతిరెడ్డి, మేకల రాజేశ్వరి శ్రీనివాస్‌తోపాటు తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement