Wednesday, May 15, 2024

పల్లె ప్రగతి స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలి : కలెక్టర్ డా.సంగీత

గ్రామాల్లో పల్లె ప్రగతి స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని మండలంలోని నాగేపల్లి, అడవి సోమనపల్లి, ఖాంసాయి పేట గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను కలెక్టర్ పర్యవేక్షించారు. నాగెపల్లి గ్రామంలో అమృత్ సరోవర్ కింద చేపట్టిన చెరువు పూడిక తీత పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని మండలంలో నాగేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసే బృహత్ పల్లె ప్రకృతి స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మియావాకి పద్ధతి ద్వారా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


అనంతరం అడవి సోమనపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కింద ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాల, అప్పర్ ప్రైమరీ పాఠశాలను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన కలెక్టర్ మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, 8వ విడత హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని సూచించారు. అనంతరం ఖాంసాయి పేట గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ, స్మశాన వాటికను కలెక్టర్ పరిశీలించారు. స్మశాన వాటికకు విద్యుత్, నీటి సరఫరా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మండల ప్రత్యేక అధికారి జడ్పీ సిఇఓ శ్రీనివాస్, మంథని జడ్పిటిసి సుమలత, ఎంపీడీవో విజయ్ కుమార్, మంథని తహాసిల్దార్ ప్రకాష్, మండల పంచాయతీ అధికారి శేషయ్యసూరి, సంబంధించిన అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement