Thursday, May 2, 2024

వరద సహాయ వీరులకు సత్కారం… నగదుతో పురస్కారం..

వరద ఆపద సమయంలో మత్స్యకారులు విశిష్ట సేవలు అందించారని, జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా కృషి చేశారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్ లో మంథని మండలం గోపాల్ పురం మానేరు వాగు వద్ద చిక్కుకున్న 19మంది బాధితులను రక్షించడంలో సహకరించిన మత్స్యకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లడుతూ… వరద సమయాల్లో, ఇతర విపత్కర సమయాల్లో తమను తాము రక్షించుకునే విధంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, తమ వద్ద ఉన్న నైపుణ్యతను ఇతరులకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. ఆపద సమయంలో ఎలా బయట పడాలనే దానిపై శిక్షణ అందించాలని, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్లానింగ్ చేయాలని, మరలా కలిసి జిల్లాలో రెస్క్యూ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చిద్దామని కలెక్టర్ తెలిపారు.

మంథని మండలం గోపాలపురం గ్రామం మానేరు వాగు వద్ద విశిష్ట సేవలు అందించి 19మంది ప్రాణాలను కాపాడినందుకు కలెక్టర్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీరు కాపాడిన ఒక్క ప్రాణం వెనక వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారని, మీరు చేసిన పని గొప్పదని, ఇకముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఆపదలో ప్రాణాలు కాపాడిన ఐదుగురు సభ్యుల కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార సొసైటీలలో సభ్యత్వం తీసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వపరంగా సహాయం అందించుటకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం వరద బాధితుల ప్రాణాలను రక్షించడంలో సహకరించిన ఎం.శ్రీనివాస్, జునుగారి రవి, గడ్డం వేంకటేశ్, జి.సందీప్ కుమార్, అరువ సాయి వంశీ అనే ఐదుగురు మత్స్యకారులను జిల్లా కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ప్రతి ఒక్కరికి 5000 రూపాయల చొప్పున చెక్కులను మొత్తం 25వేల రూపాయల పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో డిసిపి వైభవ్ గైక్వాడ్, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమ నాయక్, మంథని ఆర్.డి.ఓ. కార్యాలయ పరిపాలన అధికారి తూము రవీందర్, మంథని ఇంచార్జీ తహసిల్దార్ గిరి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement