Thursday, May 16, 2024

రేషన్ డీలర్ల కమిషన్ రూ.1400కు పెంపు.. హర్షం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. మెట్రిక్ టన్నుకు ప్రస్థుతమున్న 900 రూపాయల నుండి 1400 రూపాయలకు ముఖ్యమంత్రి ఆదేశంతో పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్ది చేకూరుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.139 కోట్ల అధనపు భారం పడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల్లోని ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్నారని, రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్ టన్నుకు 200 రూపాయలు మాత్రమే ఉండేదని, ప్రస్థుతం దానిని 1400 రూపాయలకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏరాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగా ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అధనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమిషన్ సైతం కేంద్రం పెంచుకున్నా పెంచి అందిస్తున్నామన్నారు.

ఏకమొత్తంగా రెండు రెట్లు కమిషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను పరిష్కరించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్ రెన్యూవల్ ను 5ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం రూ.10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్ లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలత వ్యక్తం చేసారు. డీలర్ల కమిషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తమ కడుపునిండా పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లకు, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement