Tuesday, May 7, 2024

వైద్యుల పనితీరుపై మండిపడ్డ ఎంపీపీ, జెడ్‌పిటిసి

కాల్వశ్రీరాంపూర్‌: వైద్యులు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించాలని కాల్వ శ్రీరాంపూర్‌ ఎంపీపీ నూనెటి సంపత్‌, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని కునారం ప్రభుత్వ ఆసుపత్రిని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు,మెడిసిన్‌ స్టాక్‌ రిజిస్టర్‌, ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలని, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ఆసుపత్రులకు పంపించినప్పటికీ ప్రథమ చికిత్స తప్పనిసరి అందించాలన్నారు. మెరుగైన వైద్యం కోసం పంపించిన పేషెంట్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలన్నారు. ప్రజలు ఆసుపత్రికి వస్తే పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయని, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. డ్యూటీకి వచ్చినా హాజర్‌ వేసుకోకపోవడం ఏంటని, విధులకు రాకపోయినప్పటికీ హాజరు ఎలా వేసుకుంటారని, ఎప్పుడైనా హాజరు వేసుకోవచ్చా అని ప్రశ్నించారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం అయితే ఉన్నత అధికారులకు పిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆసుపత్రిలో వైద్యుల సేవలపై, విధుల హాజరుపై ఆరాతీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యేలా చూడాలని అధికారులకు ఫోన్‌లో తెలిపారు. దాదాపు పోస్టులన్నీ డిప్యూటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్‌ చేయాలని ఉన్నత అధికారులను కోరారు. ఆసుపత్రిలో గ్రామానికి చెందిన ఆకతాయిలు కిటికీ అద్దాలను పగలగొట్టి కాలి సీసాలను వేస్తూ అపరిశుభ్రం చేస్తున్నారని ఎంపీపీ, జడ్పిటిసి దృష్టికి వైద్య సిబ్బంది తీసుకెళ్లారు. ఆసుపత్రిలో నీటి వసతి కోసం కృషి చేస్తామన్నారు. ఆకతాయిలపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. వారి వెంట సిహెచ్‌వో సూర్య కుమారి, హెల్త్‌ అసిస్టెంట్‌ యశోద, స్టాఫ్‌ నర్స్‌ భారతి, నాయకులు శ్రీనివాస్‌, రవి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement