Sunday, May 19, 2024

TS : నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు…నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్​కి సర్వం సిద్ధమైంది. ఉదయం నుంచి ఈఏపీ సెట్ ప్రారంభం కానుంది. మే 11 వరకు జరగనున్న ఈ పరీక్షల్లో 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా, 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మూడు గంటల పాటు రెండు సెషన్స్​లో పరీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ప్రారంభంకానున్న ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 3.5 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 2.54 లక్షల మంది ఇంజినీరింగ్​కి, లక్షా 200 మందికి పైగా ఇంజినీరింగ్ అండ్ ఫార్మా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎంసెట్​గా ఉండే ఈ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నుంచి మెడిసిన్ తొలగించి ఈఏపీసెట్​గా మార్చిన విషయం తెలిసిందే.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈఏపీసెట్​కి దాదాపు 50వేల వరకు దరఖాస్తులు అదనంగా రావటం గమనార్హం. అయితే ఇంజినీరింగ్ కోసం 1.5లక్షల మంది బాలురు నమోదు చేసుకోగా, లక్షా 3వేల మంది బాలికలు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫార్మా కోసం 73వేల మంది బాలికలు నమోదు చేసుకోగా, బాలురు 27వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

21 జోన్లలో పరీక్ష : ఏపీ, తెలంగాణలో కలిపి 21 జోన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. అందులో తెలంగాణలో 16, ఏపీలో 5 జోన్లలో ఈఏపీసెట్ జరగనుంది. హైదరాబాద్​ని నాలుగు జోన్లుగా చేయగా, ఏపీలో కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు జోన్లలో సెట్ పరీక్ష జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 301 కేంద్రాల్లో ఈఏపీసెట్ నిర్వహించనుండగా అందులో అగ్రికల్చర్, ఫార్మాకి 135, ఇంజినీరింగ్ స్ట్రీమ్ 166 కేంద్రాలను కేటాయించారు. 90 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని జేఎన్​టీయూహెచ్​ ప్రకటించింది.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాటర్ బాటిళ్లు, వాచ్​లు, సెల్​ఫోన్లు, కాలిక్యులేటర్లు లాంటివి పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపింది. విద్యార్థినులు చేతికి మెహందీ, టాటూ వంటి డిజైన్లు ఉంచుకోరాదని స్పష్టం చేసింది. మొట్టమొదటి సారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ పూర్తి కాని విద్యార్థుల నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుని పరీక్షకు అనుమతించనున్నారు. ఈఏపీసెట్​కి హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుతో పాటు లేటెస్ట్ ​ఫోటోని తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని జేఎన్​టీయూహెచ్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement