Sunday, May 19, 2024

TS: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. జేపీ న‌డ్డా

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ముస్లిం ఎజెండా
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పాలనలో దేశం అధోగతి పాలైందని దుయ్యబట్టారు. పదేళ్ల మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ముస్లిం ఎజెండాతో ముందుకు సాగుతున్నారన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను తిరుగులేని ఐదవ శక్తిగా నిలిపిన ఘనత బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారుదేనన్నారు. మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేసి ప్రపంచంలో భారత్‌ను ఆర్థిక రంగంలో మూడో స్థానంలో నిలుపుతామన్నారు. ప్రజలు అభివృద్ధిని కాంక్షించి, ప్రజా సంక్షేమం కోసం పని చేసే మోడీని ప్రధానిగా మళ్లీ ఎన్నుకునేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌ నేత, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement