Thursday, May 2, 2024

KNR: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు.. సీపీ రెమా రాజేశ్వరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అంతర్ జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్‌ రెమా రాజేశ్వరి తెలియజేశారు. గురువారం రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లి డిసిపి గైక్వాడ్ వైబావ్ రఘునాథ్, నిర్మల్ ఎస్పి ప్రవీణ్ కుమార్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పి సురేష్ కుమార్, జగిత్యాల్ ఎస్పి ఎ,భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పి పి.కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కర్ణాకర్ రావులతో పాటు రామగుండం కమీషనరేట్ పరిదిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐలతో అంతర్‌ జిల్లాల సరిహద్దు సమావేశం నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ… అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం,
సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలపై చర్చించామన్నారు. ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా, బందోబస్తు ఏర్పాట్ల గురించి, సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి ఉమ్మడి కార్యకలాపాల మీద సమాచారం సేకరించామన్నారు. ఎన్నికల సంబంధిత పరస్పర సమాచార మార్పిడి, వివిఐపి, విఐపిల కదలికల సమయంలో పరస్పర సమాచార మార్పిడి, బందోబస్తు ఏర్పాట్లలో సహకారం అందించుకోవాలన్నారు.


ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించామన్నారు. 80 సంవత్సరాల పైబడిన వృద్దులకు, మూడోవంతు అంగవైకల్యం ఉన్న వారికీ భారత ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వారికీ ఓటు వేసే విధంగా ప్రత్యేక విభాగాల ఏర్పాటు కోసం చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సరిహద్దు జిల్లాల పోలీసుల పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement