Thursday, May 16, 2024

TS: తెలంగాణలో బిజెపి ఆటలు సాగనివ్వబోం… కేసులకు భయపడేదే లేదు … రేవంత్ రెడ్డి

బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్​లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీపై మండిపడ్డారు. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే అజెండాతోనే 2021లో జనాభాను లెక్కించలేదని సీఎం దుయ్యబట్టారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆయన దుయ్యబట్టారు. రైతుల పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌ దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక్కడి ప్రాంతంలో విద్యాభివృద్ధికి బీజేపీ ఎటువంటి కృషి చేయలేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు బీజేపీ స్థానం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గోండులు, లంబాడ హక్కులను కాపాడలేదని మండిపడ్డారు. ఇంతవరకు ఆదిలాబాద్‌ లోక్‌సభ టికెట్‌ను మహిళలకు ఏ పార్టీ ఇవ్వలేదని, తొలిసారిగా ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను మహిళలకు కేటాయించినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆత్రం సుగుణ పోరాడుతోందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ అంటేనే తనకు ప్రత్యేకమైన అభిమానమని, తాను సీఎం కాగానే తొలి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో సీసీఐ మూతపడినా, కేసీఆర్‌, మోదీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పదేళ్లు మోదీ, కేసీఆర్‌ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌కు ఏం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు లెక్కిస్తున్నామని, 2021లో జనాభా లెక్కించాల్సి ఉన్నా బీజేపీ లెక్కించలేదని పేర్కొన్నారు. 2021లో జనాభాను లెక్కించకుండా అమిత్‌షా కుట్ర చేశారని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే అజెండాతో 2021లో జనాభాను లెక్కించలేదని సీఎం దుయ్యబట్టారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 50 శాతం రాష్ట్రాలు ఒప్పుకోవాలని, రిజర్వేషన్ల రద్దు కోసమే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాలను పడగొట్టారని మండిపడ్డారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు, రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని, రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని బీజేపీ చూస్తోందన్నారు.

రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నా అని తనపై అమిత్‌షా కేసు పెట్టించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌ తనపై 200 కేసులు పెట్టినా భయపడలేదని, కేసులుపెట్టి మెదీ నన్ను బెదిరించగలరా? ఆయన ప్రశ్నించారు. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. బీజేపీ చేసే కుట్రలను అడ్డుకుంటానన్నారు. రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే, మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని, తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement