Saturday, April 27, 2024

కేటీఆర్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడితే నాలిక చీరేస్తా : బీఆర్ఎస్ నేత‌ జీవీఆర్‌

రాణి రుద్రమ నువ్వు ప్రగతి భవన్ లో పని మనిషిగా పనిచేస్తున్నావా అని కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు మండిపడ్డారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీగా మారినప్పటి నుండి కేటీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన ఇంటికి వెళితే సతీమణి గిన్నెలు పారేస్తుందని రుద్రమ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. విజ్ఞత కలిగిన మహిళ నేతగా వ్యవహరించాలని అన్నారు. కేటీఆర్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు తగ్గడాన్ని చూస్తే తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. కరీంనగర్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో స్థానిక ఎంపీ బండి సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. కాలేశ్వరంకు జాతీయ హోదా కోసం బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదని అన్నారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సి వస్తుందని ప్రజల్లోకి వెళ్లడం లేదని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ కంటే కేటీఆర్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎక్కువ అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థలన్ని హైదరాబాదులోకి తీసుకువస్తున్న ఘనత కేటీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement