Saturday, May 4, 2024

పరిశ్రమలకు ప్రోత్సాహం : మంత్రి కేటీఆర్‌

సంగారెడ్డి : ప‌టాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్‌క్లాస్‌ మౌల్డ్‌ యూనిట్‌ను, డ్యూయల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త‌ల‌పై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన‌, సామర్థ్యం ఉన్న ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందన్నారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. దిగుమతులు తగ్గించి.. స్థానికంగానే ఉత్పత్తి పెంచి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయ‌న్నారు.

సశ్య విప్లవంతో లక్షల ఎకరాల సాగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింద‌న్నారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి ఉందని కేటీఆర్ తెలిపారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రం ఏర్ప‌డే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డైరీ.. నేడు ప్రభుత్వానికి డివిడెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి కూడా పెరిగింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగనుంద‌న్నారు. వచ్చే ఐదేండ్ల‌లో 25లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement