Sunday, May 5, 2024

సీత‌క్క దీక్ష భ‌గ్నం – కెసిఆర్ పై ష‌ర్మిల గ‌రం గ‌రం….

హైదరాబాద్ – క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌నే డిమాండ్ తో గ‌త రెండు రోజుల‌గా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్ లోని ఇందిరాపార్క్ లోని ధ‌ర్నా చౌక్ వ‌ద్ద సీత‌క్క రెండ్రోజులు క్రితం దీక్ష చేప‌ట్టారు…. క‌రోనా పేరుతో ప్రైవేటు ఆసుప‌త్రులు పేద‌ల‌ను పీల్చి పిప్పి చేస్తున్నాయ‌ని, ప్ర‌భుత్వ వైద్యం స‌రిగ్గా అంద‌టం లేద‌ని సీత‌క్క ఆరోపించారు ప్రైవేటులో బెడ్స్ దొర‌క్కా… ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఫీజులు క‌ట్ట‌లేక‌, ప్ర‌భుత్వాసుప‌త్రికి వెళ్ల‌లేక జ‌నం ఇబ్బందిప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. . ఏపీలో ఇప్ప‌టికే క‌రోనా వైద్యాన్ని ఆరోగ్య‌శ్రీలో చేర్చార‌ని గుర్తు చేసిన సీత‌క్క‌… తెలంగాణ‌లో కూడా చేర్చాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్న సీత‌క్క‌ను నేటి ఉద‌యం వైద్యులు ప‌రీక్ష‌లు చేశారు..ఆరోగ్యం క్షీణిస్తున్న‌ద‌ని, దీక్ష విర‌మించాల‌ని వైద్యులు సూచించారు.. అయితే అందుకు ఆమె నిరాక‌రించారు.. దీంతో ఆమె దీక్షను భ‌గ్నం చేసి హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు…

సీతక్క‌కు ష‌ర్మిల మ‌ద్ద‌తు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేయ‌డాన్ని వై ఎస్ ష‌ర్మిల త‌ప్పు ప‌ట్టారు.. ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని, ఆమెను తాము అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు. ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని ప్రశ్నించారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement