Monday, May 6, 2024

పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత తల్లిదండ్రులదే : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

పిల్లలు, విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. పిల్లలను స్మార్ట్ ఫోన్లకు బందీలు కాకుండా ఖాళీ సమయాల్లో సాంప్రదాయ బద్ధంగా భగవద్గీత పట్టించేలాగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోని బోయినపల్లి కృష్ణా నగర్ లో, శ్రీ సాయి శివ శక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు నిర్వాహకులు, అర్చకులు లక్ష్మీ నారాయణకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమ్మర్ క్యాంప్ నందు వేదిక్ మాథ్స్, యోగ, చిత్రలేఖనం, సంగీతం భగవద్గీత శ్లోకాల పారాయణం వంటి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు వెంకట్ నిష్ఠల మాట్లాడుతూ… ఐస్ఓ సర్టిఫికెట్ కలిగిన అతి కొద్ది దేవాలయాల్లో తమ సాయిబాబా దేవాలయం ఒకటిని ఇక్కడ దేవాలయ ప్రాంగణంలోనే వృద్ధాశ్రమం, గోశాల హాస్పిటల్ లేబరేటరీ, మెడికల్ షాపు నిర్వహిస్తున్నామని, 25 సంవత్సరాలుగా నిర్విరామంగా సమ్మర్ క్యాంపు ద్వారా సుమారు ఎంతో మంది భగవద్గీత శ్లోకాల నందు నిష్ణాతులైన విద్యార్థులను సమాజానికి అందించినట్లు తెలిపారు. తదుపరి జేడీ లక్ష్మీనారాయణను ట్రస్ట్ కమిటీ సత్కరించారు. ఇటువంటి మహోన్నత కార్యక్రమాలు నిర్విస్తున్న ట్రస్ట్ సేవలను లక్ష్మీనారాయణ ప్రశంసించారు. తదుపరి ట్రస్ట్ అధ్యక్షుడు నిష్ఠల వెంకట్ దంపతులకు జెడి ఫౌండేషన్ భద్రాచలం ద్వారా శ్రీ సీతారాముల స్వామి చిత్రపటమును లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా కార్పోరేటర్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నటరాజ్ తో పాటు జేడీ ఫౌండేషన్ సభ్యులు మురళి మోహన్ కుమార్, నాగ మోహన్, శరచ్చంద్ర రమేష్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement