Friday, May 17, 2024

రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో భారీ నిరసన…

కుత్బుల్లాపూర్ .. తెలంగాణ రైతన్నకి 24గంటల ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్టాప్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్‌ పార్టీ, ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డి అని రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి కూడా రానివ్వబోమని రైతన్నలు తెగేసి చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ‌లో రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని స్పష్టం చేశారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటిలు అండ్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement