Thursday, May 2, 2024

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం : మంత్రి త‌ల‌సాని

ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఈ సంవత్సరం జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సీఈ సీతారాములు, ఈఓ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్ కమిషనర్ రవి కిరణ్, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ గణేష్, ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కళ్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో 2.5 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయించాలని, దేవాలయంలో ప్రస్తుతం ఉన్న రుద్రాక్ష మండపం చెక్క పై వెండి తొడుగులతో ఉందని, దాని స్థానంలో నూతనంగా రాతి రుద్రాక్ష మండపం ఏర్పాటుచేసి బంగారు తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా ఆలయంలోని పోచమ్మ, నాగదేవత అమ్మవారి ఆలయ దర్వాజలు, తలుపులు, రాజగోపురం వద్ద గల దర్వాజ కు వెండి తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అమ్మవారి కళ్యాణం నిర్వహించే విగ్రహం చిన్నదిగా ఉన్నదని, 5 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో తమిళనాడులోని కుంభకోణం నుండి తెప్పించనున్నట్లు కమిటీ సభ్యులు, అధికారులు తెలపగా, అమ్మవారి కళ్యాణం నాటికి పెద్దసైజు విగ్రహాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో G ప్ల‌స్ 3 పద్దతిలో 40 ఫోర్ వీలర్స్, 200 టూ వీలర్ వాహనాలను పార్కింగ్ చేసే సామర్ధ్యంతో పాటు, మొదటి, రెండో అంతస్తులలో కళ్యాణ మండపం, డార్మేటరీ, షాప్స్, భక్తులకు వసతి కోసం 9 గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెల్లార్ త్రవ్వకం పనులు జరుగుతున్నాయని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయం ముందున్న వ్యాపారుల సౌకర్యార్ధం, బోనం కాంప్లెక్స్ ముందు దాతల సహకారంతో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా 48 షాప్ లను నిర్మించడం జరుగుతుందని, అక్కడ అడ్డంకిగా ఉన్న టాయిలెట్ లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. బోనం కాంప్లెక్స్ ముందు రూ.36 లక్షల వ్యయంతో భారీ రేకుల షెడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, కమిటీ సభ్యులు అశోక్ యాదవ్, ఉమానాద్ గౌడ్, బలరాం, శ్రీనివాస్ గుప్తా, నారాయణరాజు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement