Tuesday, April 30, 2024

వృద్ధాప్యం శరీరానికి సంబంధించింది.. మ‌న‌సుకు కాదు : మంత్రి కొప్పుల

వృద్ధాప్యం శరీరానికి సంబంధించింది తప్ప మనిషికి సంబంధించింది కాదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నెక్లెస్ రోడ్డుపై నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ వాకథాన్ ర్యాలీని మంత్రులు మహమూద్ అలి, కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మనం వృద్ధులం అయ్యామని ఎప్పటి నుంచి అనుకుంటామో అప్పటి నుంచే ఆ భావం మొదలవుతుందన్నారు. మనం ఎప్పుడు యువకులుగా ఉన్నామని, మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయనుకున్నట్లయితే నవయువకులుగా ఉంటారన్నారు, ఇందుకోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలన్నారు. వయస్సు పెరగడం సహజం, ఇది ఎవరికైనా తప్పదన్నారు.

ఇప్పటికీ గ్రామాల్లో 85 ఏళ్లు పైబడిన వారు కూడా యువకులుగా శక్తి వంతులుగా తిరుగుతుంటున్నారని, వాళ్ల పని వారు చేసుకూంటూ పొలం పనులు చేస్తుంటారని చెప్పారు. 75 ఏళ్ల పైబడిన వారు వృద్ధాప్యంలో ఉన్నామని అనుకోకుండా తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తున్నారని చెప్పారు. 65 ఏళ్లు నిండగానే వృద్ధులం అయ్యామన్న ఆలోచన మంచిది కాదనన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు చేస్తుందని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక డాక్టర్ ను ఏర్పాటు చేసి, వారికి వైద్య సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ నాగేశ్వర్ రావు, పార్థసారధి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, దక్షిణా మూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement