Saturday, April 27, 2024

NZB: మా స్థలాలు ఇప్పించండి… క‌లెక్ట‌రేట్ ఎదుట‌ ఆందోళన

నిజామాబాద్ సిటీ, జనవరి 29 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భీంగల్ మండలం బెజ్జోరా గ్రామంలో పేద ప్రజలకు ఇచ్చిన స్థలం అన్యాక్రాంతం అవుతుందని… మా స్థలం మాకు ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీని బెజ్జోరా గ్రామస్తులు కోరారు. భీంగల్ మండలం బెజ్జోల గ్రామ ప్రజలు తమ ఇళ్ల స్థలాలు తమ ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి తమ గోడుని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా బెజ్జోరా గ్రామస్తులు మాట్లాడుతూ… భీంగల్ మండలం – బెజ్జోర గ్రామం శివారులోని సర్వే నెం:73,74 గల విస్తీర్ణంలో 15 ఎకరాల 11 గుంటల భూమిని పేద ప్రజలకు నివాస గృహాలు కట్టుకొనుటకు బెజ్జోరా గ్రామ కర్నాలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. 2002 సంవత్సరంలో అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బెజ్జోరా గ్రామానికి వచ్చి ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి సర్వే నంబర్ 73, 74 విస్తీర్ణలో 15 ఎకరాల 11 గుంటల భూమిలో 365 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు.

అప్పట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న కొందరు మాత్రమే ఇల్లు కట్టుకోగా.. మిగిలిన వారు అలాగే ఉండిపోయారు. కానీ అర్హులైన పేదలకు అందకుండా కొందరు అక్రమంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. భూఆక్రమణ చట్టం 1905 చట్టంలోని సెక్షన్ 6, 8 ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేసి ఇల్లు నిర్మాణం చేసుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఆ స్థలంపై విచారణ చేపట్టి త‌మ స్థలం త‌మకు ఇప్పించి న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బెజ్జోరా గ్రామ ప్రజలు, భీంగల్ మండల ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement