Tuesday, April 30, 2024

TS: ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వండి.. ధర్మపురి అరవింద్

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడుగా మరోసారి అవకాశం కల్పించాలని, 5సంవత్సరాలు అవినీతి లేకుండా పరిపాలన చేసానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయన బుధవారం వసంత పంచమి సందర్భంగా పార్లమెంట్ స్థాయి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆర్మూర్ పట్టణంలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మోడీ చరిస్మాతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో చెప్పినట్లు పసుపు రైతులకు పసుపు బోర్డు తెచ్చామని దాంతో పసుపుకు మద్దతు ధర పెరిగిందన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఆర్వోభి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.

జిల్లా కేంద్రంలోని మాదవ్ నగర్ రైల్వే బ్రిడ్జి కోసం 35 సంవత్సరాలుగా ప్రజలు పోరాడారని, అది గమనించి నా హయాంలో రైల్వే మంత్రితో మాట్లాడి రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించామని, ఈ సంవత్సరంలో ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. మరోసారి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement