Thursday, May 16, 2024

Double Bed Room Houses – పేదల సొంతింటి కల‌ను నిజం చేసిన సీఎం కెసిఆర్ – మంత్రి హరీష్ రావు

రామచంద్రాపురం – నిరుపేద ప్రజల సొంతింటి కలను నిజం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దసరా క్రిస్మస్ రంజాన్ పండుగల సమయంలో కనిపించే ఆనందం ఇప్పుడు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కలలో కనిపిస్తోందన్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గృహ నిర్మాణ సముదాయమని, 9000 కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయ ప్రాంగణంలో అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు. 60 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి వారి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేశారన్నారు.

కొన్ని పార్టీలు ధర్నాలు చేస్తూనే ఉంటాయని, వారికి ఇంకొక పనిలేదని బిఆర్ఎస్ మాత్రం మాటలు చెప్పకుండా పనిచేసి చూపిస్తుందన్నారు. 11700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఒక్కరోజులోనే ఇవ్వడం జరిగిందని, ఇది ప్రతినెల కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తూనే ఉంటాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని పనిచేసే వారికి కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేద ప్రజల సొంతింటి కలను డబుల్ బెడ్ రూమ్ రూపంలో నెరవేర్చారన్నారు. కొన్ని రాజ‌కీయ పార్టీల జీవిత‌మంతా ధ‌ర్నాలే అని ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్ర‌జ‌లను గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ స‌ర్కార్ మాత్రం పేద‌ల‌ను గుండెల్లో పెట్టి చూసుకుంటుంద‌న్నారు.

ఇవాళ ప్ర‌తిప‌క్షాలు అనేక ర‌కాల మాట‌లు చెప్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నాయి. మీరు ఆలోచించండి.. ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు కల్యాణ‌ల‌క్ష్మి కార్య‌క్ర‌మం తెచ్చింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. బ‌స్తీ ద‌వఖానాల్లో పేద రోగుల‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వాల హయాంలో న‌ల్లా బిల్లు క‌ట్ట‌క‌పోతే తెల్లారేస‌రికి క‌నెక్ష‌న్ క‌ట్ చేసేవారు. కేసీఆర్ హ‌యాంలో మంచినీళ్లు అందించాం. ధ‌ర్నాలు లేనే లేవు అని స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ నేత‌లు మాట‌లు చెప్పారని, కానీ చేసి చూపించ‌లేదు అని మంత్రి మండిప‌డ్డారు. ఇవాళ ప‌నిచేసే వారెవ‌రో, మాట‌లు చెప్పే వారెవ‌రో ద‌య‌చేసి ఆలోచించాలి. కొంద‌రు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. డ‌బుల్ ఇంజిన్ గ‌వ‌ర్న‌మెంట్ల‌లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టారా? క‌ల‌లోనైనా ఊహించారా? డ‌బుల్ ఇంజిన్‌లు అన్ని ట్ర‌బులే త‌ప్పా అక్క‌డ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు లేవు. ఈ దేశంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ‌, మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, రూ. 70 ల‌క్ష‌ల విలువ చేసే ఇండ్ల‌ను మీ చేతుల్లో పెడుతున్నాం. ద‌య‌చేసి ఈ ఇండ్ల‌ను అమ్ముకోవ‌ద్దు. ఈ ఇండ్ల‌లో ప‌ది కాలాల పాటు ఆత్మ‌గౌర‌వంతో ఉండాలి. మీరంద‌రూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను దీవించాల‌ని కోరుతున్నాను. ఎన్నిక‌ల ముందు అనేక రాజ‌కీయ పార్టీల నాయ‌కులు వ‌స్తారు.. అంద‌మైన నినాదాలు ఇస్తుంటారు. మ‌న‌కు కావాల్సింది నినాదాలు కాదు.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే ప్ర‌భుత్వం కావాలి. ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను నిజం చేసే నాయ‌కుడు కేసీఆర్ మాత్ర‌మే అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement