Tuesday, April 30, 2024

Congress Campaign – తెలంగాణ లో ప్రభుత్వం మాదే – ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్

కరీంనగర్ : ఈ నెల 30న నాలుగు రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తోందని, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగసభ లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ . కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.

ఈ సందర్బంగా సభలో మాట్లాడుతూ ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో కెసిఆర్ చెప్తారా? ప్రశ్నించారు. కెసిఆర్, మోడీ ఇద్దరు ఒక్కటేనన్నారు. తెలంగాణ ను సీఎం కెసిఆర్ లూటీ చేస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడని అన్నారు. తెలంగాణ లో బీజేపీ కి పోటీ చేసి గెలిసే సత్తా లేదన్నారు. సీఎం కెసిఆర్, ఎం ఐ ఎం మద్దతుతో మాత్రమే పోటీ చేస్తున్నదని అన్నాడు. తెలంగాణ ఆదాయమంతటినీ కెసిఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు .ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కెసిఆర్ కుటుంబం చేతిలోనే ఉందని తెలిపారు. ధరణి పోర్టల్ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో ఖాజానా లూటీ అయిందని అన్నారు. తెలంగాణ ఖాజానా లో ఒక్క పైసా లేదన్నారు. ఖాజానా అంతా కెసిఆర్ ఇంట్లో ఉందన్నారు.

దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే సత్తా కాంగ్రెస్ కే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ తో పాటు నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కెసిఆర్ ప్రజా సమస్యలను పక్కకు నెట్టివేసి ఇంటి పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ల పై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని దేశ వ్యాప్తంగా జనం మార్పును కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ లో కూడా మార్పు కోరుకుంటున్నారని ఈసారి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. సోనియా ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు.

పేదలు, మహిళలు, రైతులు, యువత, దళితుల ఆకాంక్షలను మా మేనిఫెస్టో ప్రతిబింబిస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టు పేరిట వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకున్నాడని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసు కుంటారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్లను బాగుచేసే రాజ్యం అని.. బీఆర్ఎస్ పాలన అంటే దొరలు, దోపీడి, కమీషన్లు, ఇసుక దొంగల రాజ్యం అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టి పిసిసి నాయకులు అంజన్ కుమార్, రమ్యారావు, రోహిత్ రావు, మైనారిటీ నేతలు, జిల్లా నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement