Friday, May 24, 2024

చంద్రగ్రహణం.. తెలంగాణలోని పలు ఆలయాలు మూసివేత

నేడు చంద్రగ్రహణం. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు ఆలయాలు మూతపడ్డాయి. వేములవాడ
రాజారాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు అన్ని ఆలయాలను నిత్య కైంకర్య పూజల అనంతరం మూసివేశారు. మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు గ్రహణం కొనసాగనున్నది. ఈ క్రమంలో ఉదయం వేకువ జామున ఆయా ఆలయ ద్వారాలను తెరిచి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. గ్రహణం కారణంగా వేకువ జామున ఉదయం 5.30 గంటలకు రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. అంతకు ముందు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, ప్రాతః కాలపూజ అనంతరం ద్వారాలను మూసివేయగా.. సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయాన్ని మంగళవారం ఉదయం 8 గంటల 16 నిమిషాలకు అర్చకులు, అధికారులు నడుమ ద్వార బంధనం నిర్వహించారు.

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభులకు నిజాభిషేకం, నిత్య కైంకర్యాలు, చేపట్టారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరుపబడే అన్నకూటోత్సవాన్ని అంతరంగీకంగా నిర్వహించి ఆలయ సాంప్రదాయబద్ధంగా ద్వారాన్ని మూసివేశారు. గ్రహణం కారణంగా భద్రాద్రి సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అధికారులు, అర్చకులు మంగళవారం ఉదయం మూసివేశారు. అంతకు ముందు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 7.30 గంటల వరకు మూసే ఉంచనున్నారు. గ్రహణం అనంతరం ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. ఆ తర్వాత దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవ నుంచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భూపాపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని ఉదయం అధికారులు మూసివేశారు. అలాగే అనుబంధ ఆలయాల్లోనూ ద్వారబంధనం నిర్వహించారు. స్వామివారికి నిత్య కైంకర్యాల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మరో వైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. సుబ్రహ్మణేశ్వరస్వామి వారికి మొక్కులు చెల్లించారు.చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం.. సాయంత్రం 7 గంటలకు ఆలయం తెరచి మహాసంపోక్షణ చేయనున్నారు. గ్రహణం సందర్భంగా అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు వేకువ జామున ఆలయంలో అమ్మవారికి నిత్యపూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement