Monday, May 6, 2024

అసలు భూ సేకరణ కూడా పూర్తికాని ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు – కేసీఆర్ ను ప్రశ్నించిన మాజీ మంత్రి చంద్రశేఖర్

మహబూబ్ నగర్,సెప్టెంబర్ 15 (ప్రభ న్యూస్): రిజర్వాయర్లు పూర్తికాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం ఏంటని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వస్తాం అంటున్న కెసిఆర్ పనులు పూర్తికాని పాలమూరు- రంగారెడ్డి పథకం కింద మోటార్ పంపును ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు.

వచ్చేది మీ ప్రభుత్వమే అయినప్పుడు పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు ప్రాజెక్టు నుంచి కాలువలు తొవ్వి పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించవచ్చు కదా అని అన్నారు. దీనిబట్టి చూస్తే బి .ఆర్ .ఎస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని ముఖ్యమంత్రి చెప్పకనే చెబుతున్నారని ఆయన తెలిపారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, తరువాత రోజుకు 1 టీఎంసీ చొప్పున నీళ్లను ఎత్తిపోసే విధంగా డిజైన్లు మార్చి నేడు ఒక్క పంపు తో రోజుకు ఒక టీఎంసీ నీళ్లను తోడేస్తే మొత్తం 3000 క్యూసెక్కుల నీళ్లు వస్తాయని ఇవి ఏ రైతు పొలానికి పారిస్తారో ప్రభుత్వం రైతులకు చెప్పాలని నిలదీశారు..

అంతేకాక రిజర్వాయర్ల నుంచి కాలువలు లేకుండా లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా వస్తాయో కూడ సమాధానం చెప్పాలని అన్నారు.ఎన్నికలవేళ మరోసారి పాలమూరు ప్రజలను ,రైతులను మోసం చేసేందుకే కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు కేమో తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి ఇక్కడనేమో రైతులకు లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఇది తాగునీటి ప్రాజెక్ట లేక సాగునీటి ప్రాజెక్టు కెసిఆర్ చెప్పాలన్నారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు, పాలమూరు రైతాంగం కెసిఆర్ మాయ మాటలు నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్లకు ఇంకా భూసేకరణ కూడా పూర్తి కాలేదని అసలు లక్ష్మీదేవి పల్లి వద్ద నిర్మించాల్సిన రిజర్వాయర్ను రద్దు చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఈ రిజర్వాయర్ పరిస్థితి ఏమిటని ఆయన విమర్శించారు.

- Advertisement -

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, పద్మజా రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు క్రిస్టియ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధిక్షలు సేరి రథంగా పాండురంగారెడ్డి ,బుచ్చిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చు గట్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement