Saturday, May 25, 2024

భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి.. రాహుల్ తో పలు విషయాలు మాట్లాడిన పూజాభట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎనిమిదవ రోజుకి చేరుకుంది. రాహుల్ పాదయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. గత రాత్రి బస చేసిన బోయిన్ పల్లి నుంచి రాహుల్ గాంధీ బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి బాలానగర్, హబీబ్ నగర్, మూసాపేట, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, మియాపూర్, మదీనగూడ మీదుగా సాగింది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్రను తిరిగి ప్రారంబించనున్నారు. సాయంత్రం రామచంద్రాపురం, పఠాన్ చెరువు మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. పఠాన్ చెరువు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటి ముత్తంగి వరక పాదయాత్ర సాగనుంది. రుద్రారంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నిజాంపేట కూడలి వద్ద రాహుల్‌కు మహిళలు భోనాలతో స్వాగతం పలికారు. అందరికి అభివాదం చేస్తూ ఉత్సాహంతో రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. బుధవారం రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి, నిర్మాత పూజా భట్ పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర పాల్గొన్న పూజా భట్ రాహుల్‌తో కలిసి కొంతసేపు నడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రోజుకో కొత్త చరిత్ర సృష్టిస్తోంది… దేశంలో ప్రేమను ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా పూజా భట్ రాహుల్‌తో పలు విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా పూజా భట్ నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement