Monday, April 29, 2024

యువత ఆగ్రహానికి బీజేపీనే కారణం.. బీజేపీ పాలిత రాష్ట్రాల సెగ తెలంగాణకు తాకింది

సూర్యాపేట, ప్రభన్యూస్‌: అగ్నిపథ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి అంటూ ఉద్యమం మొదలైందే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలు అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించిందని… దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. ఈ మేరకు శనివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకు పరాకాష్టే బీహార్‌, సికింద్రాబాద్‌ ఉదంతాలన్నారు. ఇది మరింత ముదరక ముందే మోడీ సర్కార్‌ అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్‌ చేశారు. పైకి అగ్నిపథ్‌పై పోరాటంలా కనిపిస్తున్నప్పటికి బీజేపీ పాలనపై రగిలిపోతున్న యువత ఆగ్రహం ఈ రూపంలో కనిపించిందన్నారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోడీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోకపోవడం కూడా కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోందన్నారు. మోడీకి ముందు దేశాన్ని పాలించిన పాలకులు దోచుకొని విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెస్తానన్న మోడీ సర్కార్‌ ఆ పద్దతిలో చర్యలు తీసుకోకపోవడం కుడా వారి ఆవేశానికి కారణంగా కనిపిస్తుందన్నారు. అగ్నిపథ్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆక్రోశంతో రగిలిపోతున్న యువత సహనానికి పరీక్షలు పెడితే ఎదురయ్యే పరిణామాలకు బీహార్‌, సికింద్రాబాద్‌ సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement