Friday, May 17, 2024

క్రమశిక్షణతో కూడిన క్రీడా స్పూర్తి అవసరం..

మంచిర్యాల : క్రీడాకారులకు క్రమశిక్షణతో కూడిన క్రమశిక్షణ అవసరమనిమాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలలో మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు. మండలంలోని నెల్కి వెంకటాపూర్‌ మైధానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 18 మండలాల్లో 392 టీమ్‌లు తలపడుతున్నాయని అన్నారు. ముందుగా మండల స్థాయిలో గెలుపొందిన టీమ్‌లను జిల్లా స్థాయిలో ఆడించి గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జిల్లా నుండి బీబీసీఐ ద్వారా ఇండియా టీమ్‌లో ఆడించడమే తమ ధ్యేయమని అన్నారు. ఇందుకు గాను కఠోర శ్రమ అవసరమని, తమ ట్రస్టు ద్వారా ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసి తర్ఫీదు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల స్థాయిలో విన్నర్‌గా నిలిచిన కొర్విచెల్మ జట్టుకు రూ.75వేల నగదు, రన్నర్‌గా నిలిచిన ద్వారక టీమ్‌ జట్టుకు రూ.40వేల నగదు, సెమీఫైనల్‌కు చేరుకున్న రెబ్బెనపల్లి, కొండాపూర్‌ జట్లకు చేరో రూ.20వేల చొప్పున నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్‌పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీటీసీ వనపర్తి మాలిక-రవి, మాజీ ఎంపీపీలు జాబు కాంతారావు, అక్కల శకుంతల, అక్కల వెంకటేశ్వర్లు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గడ్డం త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement