Saturday, May 4, 2024

108 సర్వీసులు మరింత విస్తృతం, మారుమూల ప్రాంతాలకు విస్తరణ: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పేదలు, సామాన్యులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను సీఎం కేసీఆర్‌ బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో రోగులను ఆసుపత్రులకు చేర్చే 108 అంబులెన్స్‌ లసేవలను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 అంబులెన్సులు సేవలందిస్తున్నాయని వివరించారు. వెంగల్‌ రావునగర్‌ లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బుధవారం కొత్తగా రెండు అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు.కార్పోరేటు బాధ్యత కింద సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుంచి అంబులెన్స్‌ లను సమకూర్చిన ఇండస్‌ ఇండ్‌ బ్యాం కును అభినందించారు. త్వరలో మరో 8 అంబులెన్సు లను ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఇవ్వనుందని చెప్పారు.

వినియోగంలో ఉండి కాలం చెల్లిన, పూర్తిగా చెడిపోయిన అంబులెన్సు వాహనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ , అత్యవసర సేవలకు అంతరాయం లేకుండాచర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15-20 నిమిషాల్లో అంబులెన్స్‌ సేవలందుతున్నాంయన్నారు. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తక్షణ వైద్యాన్ని అందించేలా అంబులెన్సుల్లో బేసిక్‌ లైఫ్‌ సపోర్టు వ్యవస్థ ఉండగా, అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి చేరే లోగా ప్రాణాలు కాపాడే అడ్వాన్స్‌డు లైఫ్‌ సపోర్టు సిస్టం కలిగిన అంబులెన్స్‌లు కూడా ఉన్నాయన్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాలుగున్నర లక్షల మందికి అంబులెన్సులు సేవలు అందించాయన్నారు. ఎమర్జెన్సీ మెడికల్‌ సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు, అంబులెన్స్‌ వెళ్లలేని ప్రాంతాలకు 50 బైక్‌ అంబులెన్స్‌లను ప్రభుత్వం సమకూర్చిందన్నారు.

మారుమూల గిరిజన ప్రాంత వాసుల కోసం ఐటీడీఏ పరిధిలో, హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి పట్టణ పరిధిలో ఇవి సేవలందిస్తున్నాయని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 25 అంబులెన్సులు ప్రతి నెల సగటున 750 ఎమర్జెన్సీ కేసులకు సేవలందిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి నుంచి ఈ ఏడాది పిబ్రవరి వరకు దాదాపు 19వేల మందికి ఈ 50 బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందాయన్నారు. మారు మూల పల్లెల నుంచి గర్భిణులను ఆసుపత్రులకు తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేందుకు 300 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. పార్థీవ దేహాలను తరలించేందుకు 50 పరమపద వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అవసాన దశలో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు గాను దీనికి అదనంగా 30 ఆలన వాహనాలను ఏర్పాటు చెసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement