Saturday, April 27, 2024

దీక్షతో పోరాటం ఆగదు.. కేసీఆర్ కు షర్మిల వార్నింగ్!

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మూడు రోజుల దీక్ష చేపట్టిన వైఎస్ ష‌ర్మిల త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మొద‌ట హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద అనంత‌రం లోట‌స్‌పాండ్ వ‌ద్ద ష‌ర్మిల 72 గంట‌ల పాటు నిరాహార దీక్ష‌ను చేశారు. ఈ రోజు ఆమెతో నిరుద్యోగుల కుటుంబ స‌భ్యులు దీక్ష‌ను విర‌మింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

నేడు తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఎప్పుడు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నారని షర్మిల అన్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉద్యోగాల కోసం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. అప్ప‌ట్లో వైఎస్సార్ మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చారని, ప్రైవేటు రంగంలోనూ ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం అసమ‌ర్థుడని విమర్శించారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని చెప్పారు. అవ‌న్నీ అస‌త్యాలేన‌ని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయని షర్మిల పేర్కొన్నారు.

దొర‌లు గ‌డీ నుంచి నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేతుల‌కు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాను పోరాటం చేస్తాన‌ని వ‌చ్చానన్నారు. కులాలు, మ‌తాలకు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను వైఎస్సాఆర్ అందించారని తెలిపారు. పోలీసుల‌కు అడ్డుపెట్టుకుని మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేశారని ష‌ర్మిల తెలిపారు. పోలీసులు లా అండ్ ఆర్డ‌ర్ కోసం ప‌నిచేస్తున్నారా?  కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా? అని నిలదీశారు. త‌న పోరాటం ఆగ‌బోద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. ’ మాట మీద నిల‌బ‌డ్డ‌ రాజ‌న్న బిడ్డగా చెబుతున్నా.. నేను పోరాటాన్ని కొన‌సాగిస్తూ ఉంటాను’ అని వ్యాఖ్యానించారు. ల‌క్షా 91 వేల ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement