Tuesday, May 7, 2024

KTR: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేద్దాం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియ పైన మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషితో అగ్రస్థానంలో నిలిచామని, ఈసారి ర్యాంకుల్లో సైతం అగ్రస్థానంలో నిలిచే కృషి చేద్దామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈసారి రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు ఇక్కడి అధికారులు చొరవ వలన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దక్కించుకోవడం ఎంతో దోహదకారిగా నిలిచిందన్నారు. ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అభిప్రాయపడ్డారు. తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని ఈ దిశగా పని చేద్దాం మంత్రి కేటీఆర్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement