రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. అయితే.. అతనికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపైనే అధిష్ఠానం ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈ విషయంపై సీనియర్లతో సోనియా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు ఆయనకు పదవి ఇచ్చే విషయంలో చాలా సీరియస్గానే మంతనాలు జరిపారు. వారికి కూడా ఏం చేయాలో తెలియక చివరికి ఆ విషయాన్ని సోనియాకే వదిలేసినట్టు సమాచారం.
దీంతో ఇప్పుడు పీకే పదవి అనే బంతి సోనియా కోర్టులోనే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పీకేకు ఏ పదవి ఇవ్వాలన్నది పార్టీ అధినేత్రి సోనియా ఇష్టమని, ఆమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం కాంగ్రెస్ చీఫ్ సోనియాతో మరోమారు భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి అని బయటికి చెబుతున్నా.. అసలు విషయం పీకేకు ఏ పదవి ఇవ్వాలన్న దానిపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో ఇదే విషయంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. పీకేకు పదవి ఇచ్చే విషయంలో సోనియాదే అంతిమ నిర్ణయం. మేము సోనియాపైనే పెట్టేశాం. అధ్యక్షురాలు సోనియా పలుమార్లు చర్చలు జరిపారు. సీనియర్లతో కూడా చర్చిస్తున్నారు. ఇది పూర్తి కావడమే తరువాయి.. ఆయన పార్టీ కండువా కప్పేసుకుంటారు అని సీనియర్ నేత ఒకరు తెలిపారు.