Thursday, May 2, 2024

భూమిపై నీటికి మూలం అదేనట.. పురాతన గ్రహశకలం పరిశోధనలో వెల్లడి..

ప్ర‌భ‌న్యూస్ : సమస్త జీవరాశి మనుగడకు మూలాధారమైన వనరు నీరు. భూమ్మీద మూడొంతుల ప్రదేశాన్ని ఆక్రమించింది. వర్షాల ద్వారా నీరు వస్తుందనేది ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయం. కానీ, నీటికి మూలం సూర్యుడని తాజా పరిశోధనలో తేలింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనే అంశాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2010లో జపాన్‌కు చెందిన హయాబుసా మిషన్‌ ద్వారా సేకరించిన పురాతన గ్రహశకలాన్ని విశ్లేషించిన యూకే, ఆస్ట్రేలియా, అమెరికా పరిశోధకులు నీటి మూలాలను కనుగొన్నారు. గ్రహాంతర ధూళి రేణువుల ద్వారా నీరు భూమ్మీదకు చేరిందని చెబుతున్నారు. సౌరగాలి అని పిలువబడే సూర్యుడి నుంచి చార్జ్‌ చేయబడిన కణాలు నీటి అణువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన రసాయన కూర్పు ద్వారా నీరు ఉత్పత్తి అయిందని తేల్చారు.

నేచర్‌ ఆస్ట్రానమీ జర్నల్‌లో అధ్యయనం వివరాలు ప్రచురించబడ్డాయి. భూమ్మీది నీటిలో కొంతభాగం సి-టైప్‌ ఉల్కల నుంచి వచ్చి వుండవచ్చని, మరికొంత భాగం సౌర వ్యవస్థలో మరెక్కడైనా ఉద్భవించిన ఐసోటోపికల్‌- లైట్‌ సోర్స్‌ నుంచి వచ్చివుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్‌లోఅంతరిక్ష యాత్రలు, గాలిలేని ప్రపంచాలపై నీటి వనరుల అన్వేషణకు ఈ పరిశోధన సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడికి దగ్గరి కక్ష్యలోని ఎస్‌-రకం గ్రహశకలంగా పిలువబడే వేరే రకమైన అంతరిక్ష శిల నుంచి నమూనాలను పరిశీలించడానికి గ్లాస్గో వర్సిటీ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం టోమోగ్రఫీని చేపట్టింది. ఇందుకు సంబంధించిన నమూనాలను ఇటోకావా గ్రహశకలం నుంచి వచ్చాయి. సౌరగాలి ఎక్కువగా హైడ్రోజన్‌, హీలియం అయాన్ల ప్రవాహాలు.

ఇవి సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి నిరంతరం ప్రవహిస్తాయి. ఆ హైడ్రోజన్‌ అయాన్లు ఒక గ్రహశకలం లేదా అంతరిక్షంలోకి వచ్చే ధూళికణం వంటి గాలిలేని ఉపరితలాన్ని తాకినప్పుడు, ఉపరితలం కింద కొన్ని పదుల నానోమీటర్ల లోపలికి చొచ్చుకువెళ్తాయి. అవి అక్కడ రాతిపై రసాయన కూర్పును ప్రభావితం చేస్తాయి. కాలక్రమేణా హైడ్రోజన్‌ అయాన్ల అంతరిక్ష వాతావరణ ప్రభావం, హెచ్‌2ఒ నీటిని సృష్టించడానికి గ్రహశకలంలోని ఖనిజాలలో చిక్కుకున్న ఆక్సిజన్‌ అణువులను బయటకు తీస్తుంది అని అధ్యయనం ప్రధాన రచయిత డాక్టర్‌ లూక్‌ డాలీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభ సౌరవ్యవస్థ చాలా ధూళి ప్రదేశమని, ఇది అంతరిక్షంలోకి వచ్చే ధూళి కణాళ ఉపరితలం కింద నీటి ఉత్పత్తికి దోహదం చేసివుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడిన భూమికి చేరుకున్న సూక్ష్మ-కణిత ధూళి ఇక్కడి జలాశయాలకు మూలంకావచ్చ‌ని ఈ అధ్యయనం గట్టిగా చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement