Wednesday, April 17, 2024

డోకిపర్రులో కన్నులపండువగా వేంకటేశ్వరస్వామి కళ్యాణం

అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణాజిల్లా డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి విశేష కళ్యాణం బుధవారం కన్నుల పండువగా జరిగింది. మహాక్షత్రం షష్టమ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవదేవుని విశేష కల్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు నిర్వహిం చారు. వారిరువురూ పీటల మీద కూర్చొని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణతో పాటు కళ్యాణం విశిష్టతను, దాని వల్ల కలిగే మంచిని అర్ధాలతో సహా వివరించారు. శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం నిర్వహణకు మహాక్షేత్రాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించారు. ఆడపిల్లలు లేని వారు లక్ష్మి, పద్మావతి దేవిలను తమ కన్యకా రత్నాలుగా భావించి దివ్యశ్రీ వైఖా నస భగవచ్చాస్త్ర మార్గాను సారంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం వలన కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వేద పండితులు వివరించారు.
శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణానికి ముందు దేవతామూర్తులకు వేదపండితులు చక్రస్నానం జరిపించారు. ఉదయం నిత్య అర్చన, తోమాల సేవ అనంతరం ఉత్సవ మూర్తులను స్నపన మండపం వద్దకు తోడ్కొని వచ్చి పాలు, పెరుగు, తేనే, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకం, చూర్ణ, గంధోత్సవం నిర్వహించి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో చక్రస్నానం జరిపించారు. చక్రస్నానం సందర్భంగా కోనేటిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. శ్రీవారి చక్రస్నానం ఆచరించిన తరువాత కోనేటిలో స్నానమాచరించిన, దర్శించినా, కోనేటి నీటిని చల్లుకున్నా వంద అశ్వమేధాల శక్తీ వస్తుందని వేదపండితులు తెలిపారు. ప్రతిరోజు స్వామి వారి పుష్కరిణిలో స్నానమాచరిస్తే నదీ పుష్కరాల సమయంలో పుణ్య స్నానం చేసినంత ఫలితం ఉంటు-ందని తెలిపారు. శ్రీ వారిచక్రస్నానం, కళ్యాణంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి, పీవీ సుబ్బారెడ్డి, సుమలత, పీ.వీరారెడ్డి, విజయలక్ష్మి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ, పీ.నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు, వారి కుటు-ంబసభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement