సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం… ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్… ఇప్పుడు ప్రజలు అసహ్యించుకునే స్థితికి దిగజారడని పేర్కొన్నారు. అందుకే కొత్త నాటకాన్ని షూరు చేసి, తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నడని మండిపడ్డారు. కేంద్రం మీద నిందలు వేస్తూ రాజకీయ పబ్భం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్నాడని చెప్పారు.
తెలంగాణలో అన్ని అనర్థాలకు కారణం ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అని, అబద్దాల పుట్ట అయిన కేసీఆర్ మాటల్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. అందుకే కొత్తగా వడ్ల నాటకం మొదలుపెట్టిండని ఆరోపించారు. కేంద్రం ఎక్కడా వడ్లు కొననని చెప్పలేదన్న విజయశాంతి.. కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం మీద కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలినందునే పంజాబ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ బీజేపీ గొంతు నొక్కాలని చూస్తే… ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికే హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్కు కర్రు కాల్చి వాతపెట్టారని ఎద్దేవా చేశారు. మా బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే అధికారపార్టీ లొసుగులు బయటపెడతారనే భయంతోనే సస్పెన్షన్ పేరుతో బయటకు పంపారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితాలే రాష్ట్రమంతా పునరావృతం అవుతాయని చెప్పారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నడని అన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే… వాళ్లు ఆ మట్టితోనే కేసీఆర్ సర్కార్కి బొందపెట్టి తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి హెచ్చరించారు.