Monday, May 6, 2024

వెటర్నరీ డ్రగ్‌.. జాంబీలలా మారిపోతున్న ప్ర‌జ‌ల‌ శ‌రీరం

డ్ర‌గ్ ఓవ‌ర్ డోసు కార‌ణంగా ప్ర‌జ‌ల చ‌ర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా క‌నిపిస్తుంద‌ట‌. ఈ సంఘ‌ట‌న అమెరికాలో చోటు చేసుకుంది. ట్రాంక్ గా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తుంది. దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్‌ కనిపిస్తున్నదని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ఈ జైలజీన్‌ డ్రగ్‌ జంతువులకు వినియోగించే మందు అని, అయితే దీన్ని మధ్యస్థం నుంచి తీవ్ర ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు హెరాయిన్‌ మాదిరిగా అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది.

మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్‌.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌ వంటి నగరాలకు కూడా పాకింది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్‌ మానవులకు సురక్షితం కాదని, దీన్ని ఓవర్‌ డో స్‌ తీసుకొన్న వారికి రివర్స్‌ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రాంక్‌ డోప్‌ అనేది ఫెంటానిల్‌ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను నాశనం చేస్తున్నదని స్కై న్యూస్‌ పేర్కొన్నది. ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. ఈ డ్రగ్‌ దేశమంతటా వ్యాప్తిచెందితే.. అది ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement