కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆనవాయితీ ప్రకారం యువతి ఇంటి పేరు మారుతుంది. ఆమె పేరు ముందు అత్తారింటి పేరు చేరుతుంది. అయితే, పెళ్లయిన తర్వాత యువతులు సత్వరమే తమ ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు వీలుగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. పెళ్లయిన వారు అత్తవారింట్లో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకోవడం ఇక సులభతరం కానుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఇంటి పేరు మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
కొత్తగా ఇంటి పేరు మార్చుకోవాల్సిన వారి నుంచి సచివాలయాల్లో వేలిముద్రలు తీసుకుంటారు. ఆ విధంగా నమోదైన వేలిముద్రలకు ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలుపుతారు. ఆమె పేరును రేషన్ కార్డులోనూ చేర్చుతారు. తద్వారా ఆమె ప్రభుత్వ పథకాలకు అర్హురాలు అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.