Tuesday, May 7, 2024

టార్గెట్​ 2024: సోనియా కీల‌క నిర్ణ‌యం.. మ‌రోసారి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో భేటీకి సన్నాహాలు..

అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల రిజల్ట్స్​ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీలతో కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. అన్నిప్ర‌తిప‌క్ష‌ పార్టీల‌తో స‌మావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఏకం చేయాల‌న్న ల‌క్ష్యంతోనే ఈ భేటీ ఉండబోతోందని పొలిటికల్​ వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన ప్రాథ‌మిక చ‌ర్చ‌ల‌ను సోనియా ఇప్ప‌టికే పూర్తి చేసినట్టు సమాచారం. అయితే.. గతంలోనూ సోనియా ఆధ్వ‌ర్యంలో ఓ అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌త‌ను ఆహ్వానించ లేదు. అయితే.. ఈ సారి మాత్రం మ‌మ‌త‌కు ఆహ్వానం ఉంటుందంటున్నారు.

‘‘గ‌తంలో రెండు సార్లు ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హించాం. ఈ రెండు సార్లూ అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలనూ ఆహ్వానించాం. ఈ సారి కూడా అలాగే అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌నూ ఆహ్వానిస్తాం’’ అని కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ప్ర‌క‌టించారు. ఈ స‌మావేశానికి సీపీఎం వెన‌క నుంచి కీల‌కమైన మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు స‌మాచారం. చాలా పార్టీలు ఎన్నికల్లో బిజీగా ఉన్నాయ‌ని, అందుకే ఫ‌లితాల త‌ర్వాతే ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీ ప్ర‌క‌టించారు.

గ‌తేడాది ఆగ‌స్టులో అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనికి 19 పార్టీలు హాజ‌ర‌య్యాయి. దేశ భ‌విష్య‌త్తు దృష్ట్యా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి, క‌లిసి రావాల‌ని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా పిలుపునిచ్చారు. అంతేకాకుండా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఓ రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకుందాని సోనియా ఈ స‌మావేశంలో సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement