Friday, April 26, 2024

అస‌మ్మ‌తి లీడ‌ర్ల‌కు షాకిచ్చిన సోనియా.. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఎవ‌రంటే..

కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా తానే ఉంటాన‌ని, ఫుల్ టైమ్ కొన‌సాగుతాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు సోనియా గాంధీ. పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీబ్ల్యూసీ) భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త నాయకత్వం ఎంపిక ఇప్పట్లో ఉండబోదని, ఫుల్ టైమ్ అధ్యక్షురాలు తానేనని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అదే సమయంలో తనపై అసమ్మతిగళం వినిపించిన 23 మంది సీనియర్లకు క్లాస్ పీకారు..

ఏడేళ్లుగా అధికారానికి దూరమై, ఒక్కొక్కరుగా నేతలను కోల్పోతున్న కాంగ్రెస్ కు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా సీడబ్ల్యూసీ ఉంటుందని భావించినా, ప్రస్తుతానికి నాయకత్వ మార్పుకంటే పార్టీలో క్రమశిక్షణ, అధికార బీజేపీపై పోరాటం ఉధృతం లాంటి అంశాలే ప్రధానమైనవని సోనియా గాంధీ అన్నారు. సంస్థాగత ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూనే, వాటి కోసం సీనియర్లు కొందరు రచ్చకెక్కడాన్ని ఖండించారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్ అప్ డేట్స్..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ప్రారంభ ఉపన్యాసంలోనే సోనియా గాంధీ పలు సంకేతాలు, సూచనలు, చురకలు ఇచ్చారు. ఆమె అధ్యక్షతన సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జ‌రుగుతున్న‌ భేటీకి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీసహా సంస్థాగత ఎన్నికలు డిమాండ్ చేస్తూ గతంలో సోనియాకు అసమ్మతి లేఖ రాసి, మీడియాకెక్కిన సీనియర్లు సైతం హాజరయ్యారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నందున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరే అటెండ్ కాలేదు. సీనియర్ల రచ్చపై సోనియా గరం గరం వ్యాఖ్యలతో క్లాస్ పీకారు.

‘సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటాన్ని నేను ఎల్లవేళలా స్వాగతించాను. కానీ మన సీనియర్లు కొందరు సంస్థాగత ఎన్నికల విషయమై బయట ఏవేవో మాట్లాడారు. నాలుగు గోడల మధ్య జరిగే సీబ్ల్యూసీ భేటీపై మీడియాతో మరో రకంగా మాట్లాడం మానేయాలి. పార్టీ పదవులకు ఎన్నిక అనివార్యమన్న విషయం నాకు గుర్తుంది. 2019 నుంచి నేను తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉంటున్నానన్న సంగతిని మర్చిపోలేదు. అయితే, మీరు అనుమతించినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలిగా నేనే ఉంటాను’అని సోనియా గాంధీ అన్నారు.

మోడీ సర్కారుపై కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నదని, సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమం, కరోనా విపత్తు నిర్వహణలో కేంద్ర వైఫల్యం తదితర అంశాల్లో పార్టీ ప్రజల వైపు నిలిచిందని సోనియా గుర్తుచేశారు. కలిసివచ్చే పార్టీలతో తరచూ సంభాషణలు జరుపుతూ, పార్లమెంట్ వేదికగా ఉమ్మడి పోరాటం చేస్తున్నామని ఆమె తెలిపారు. పార్టీలో కింది నుంచి పైదాకా సమర్థవంతమైన, పనిచేసే నాయకత్వాన్ని పెంపొందించుకుందామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement