Sunday, May 19, 2024

లేటు వయసులో సెన్సేష‌న్‌.. చాలా కాలం త‌ర్వాత ఆ ప‌నిచేసిన ఎమ్మెల్యే

ఒడిశా ఎమ్మెల్యే అంగద కన్హర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. అందుకు కారణం ఆయన లేటు వ‌య‌సులో పదో తరగతి పరీక్షలు రాయడమే. అంగద కన్హర్ బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీకి చెందిన శాసనసభ్యుడు. ఫూల్ బనీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయ‌న వయసు 58 సంవత్సరాలు కాగా, ఈ వయసులో పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో మీడియా ఆయనపై దృష్టి సారించింది. తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలతో చదువు మధ్యలోనే ఆపేశానని, పదో తరగతి పరీక్షలు రాయలేకపోయానని అంగద కన్హర్ వెల్లడించారు.

తన క్లాస్ మేట్స్, సీనియర్లు చాలా కష్టపడి చదువుకున్నారన్న ఉదంతాలు విని తనలోనూ స్ఫూర్తి కలిగిందని చెప్పారు. సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని గుర్తించానని, కానీ కొద్దిగా భయపడ్డానని వెల్లడించారు. అయితే, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు తనను ప్రోత్సహించి పరీక్షలు రాసేలా చేశారని వివరించారు. కాగా, కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని హైస్కూల్ లో ఆయనకు సెంటర్ కేటాయించగా, ఇతర విద్యార్థులతో కలిసి ఇవాళ పరీక్షకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పరీక్ష రాస్తుండడంతో హైస్కూల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement